ఎన్ ఎస్ ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆమె నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో-లొకేషన్ స్కామ్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ కేసులో రెండో నిందితుడు ఆనంద్ సుబ్రమణ్యంకు కూడా బెయిల్ లభించింది. సుబ్రమణ్యం గతంలో ఎన్ఎస్ఈకి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన చిత్రా రామకృష్ణకు ఆయన సలహాదారుగా కూడా ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై 2018లో మొదటిసారిగా కేసు నమోదైంది.
కాగా చిత్రా రామకృష్ణను ఈ ఏడాది మార్చి 6వ తేదీన అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు ట్రయల్ కోర్టు ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. అదే సమయంలో ఫిబ్రవరి 24వ తేదీన ఆనంద్ సుబ్రమణ్యంను కూడా అరెస్టు చేశారు. కో-లొకేషన్ స్కామ్ కేసులో 2018 సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. NSE కో -లోకేషన్ సర్వీసును కలిగి ఉంది. దీని కింద బ్రోకరేజ్ సంస్థలు తమ సర్వర్లను NSE క్యాంపస్లో ఉంచడానికి యాక్సెస్ ఉంటుంది. దీని వల్ల వారు మార్కెట్ అప్ డేట్ లను వేగంగా పొందుతారు. కానీ కొందరు బ్రోకర్లు ఈ సర్వీస్ను ట్యాంపరింగ్ చేసి కోట్లలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలింది.