Wednesday, March 27, 2024

Order.. Order: ఇంటి నిర్మాణానికి డబ్బు అడిగినా.. వరకట్న నేరమే!

ఇంటి నిర్మాణం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను కోరడం కూడా వరకట్నం డిమాండ్‌ చేయడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేరానికి భారత శిక్షా స్మృతిలోని 304-బి నిబంధన కింద శిక్ష వర్తిస్తుందని తెలిపింది. కట్నం వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు చనిపోయిన కేసులో- ఆమె భర్త, మామలకు విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్ష విధించడం సరైనదేనని తేల్చి చెప్పింది. కాగా, ఈ విషయంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు తప్పుగా భావించిందని పేర్కొంది. ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ.. అదనపు కట్నం కోసం భర్త, మామ పెడుతున్న వేధింపులు తాళలేక అత్తింటిలోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారిద్దరిపై కట్నం వేధింపులు, వరకట్న మరణం, ఆత్మహత్యకు ప్రేరేపించడం (ఐపీసీ 498-ఎ, 304-బి, 306 నిబంధనలు) కింద కేసు నమోదైంది. కాగా ఈ కేసులో న్యాయస్థానం దోషులిద్దరికీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే, వారు దీన్ని సవాలుచేస్తూ హైకోర్టుకు వెళ్లగా.. ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు అడిగారని హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఈ వ్యవహారంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం విచారణ సాగించింది. ఏదైనా ఆస్తిని లేదా ‘వాల్యుబుల్‌ సెక్యూరిటీ’ని అడగడమూ వరకట్నం నిర్వచనం పరిధిలోకే వస్తాయని బెంచ్ తెలిపింది. ఈ విషయంలో హైకోర్టు పొరబడిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో వేళ్లూనుకున్న చీడను రూపుమాపాలన్నదే చట్టం తాలూకూ మూల ఉద్దేశమన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కిందికోర్టు దోషులకు శిక్ష విధించడం సరైనదేనని స్పష్టం చేసింది. అయితే శిక్షా కాలాన్ని ఏడేళ్లకు కుదిస్తున్నట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement