Wednesday, March 27, 2024

Brave man | హాస్పిటల్​లో సత్యేంద్రకు చికిత్స.. పరామర్శించిన కేజ్రీవాల్​

ఈడీ కేసులో జైలుకు వెళ్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆప్​ నేత, మాజీ మంత్రి సత్యేంద్రజైన్​ని ఇవ్వాల (ఆదివారం) పార్టీ జాతీయ కన్వీనర్​, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ కలిశారు.  గత ఏడాది జైన్‌ని అరెస్టు చేసిన తర్వాత వీరిద్దరి మధ్య ఇదే మొదటి భేటీ కావడం గమనార్హం. కాగా, ట్విటర్‌లో కేజ్రీవాల్ తన సహచర నేత, మాజీ మంత్రిని ఉద్దేశించి ‘బ్రేవ్ హీరో’ అని పేర్కొన్నారు. సత్యేంద్రను కలిసిన ఫొటోలను కూడా కేజ్రీవాల్​​ షేర్​ చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత ఏడాది మేలో అరెస్టు చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సుప్రీంకోర్టు శుక్రవారం ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ను అనుమతించింది. మైకం కారణంగా జైలు వాష్‌రూమ్‌లో సత్యేంద్ర స్పృహతప్పి పడిపోయాడు. గత గురువారం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైన్‌ను మొదట దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే లోక్ నాయక్ జయప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి తరలించారు.

కాగా, గత శుక్రవారం తనకు నచ్చిన ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని మాజీ ఆరోగ్య మంత్రి అయిన సత్యేంద్రజైన్​కు సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగిసే వరకు అంటే జులై 11 వ తేదీ వరకు సత్యేంద్ర జైన్​ మీడియాతో ఇంటరాక్ట్ కావద్దని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇక.. ఇవ్వాల (ఆదివారం) ఉదయం జైన్‌ను న్యూరోసర్జరీ ఓపీడీకి తీసుకెళ్లారని, డాక్టర్లు పరీక్షించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు.

అతనికి చికిత్స జరుగుతున్నప్పుడు  కూడా పోలీసులు దగ్గరే ఉన్నారు. ఇక.. జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల సహకారంతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని దర్యాప్తు సంస్థ ఈడీ ఆరోపించింది. అతని ఆస్తులను అటాచ్ చేసిన తర్వాత జైన్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఐదు కంపెనీలకు సంబంధించిన 4.81 కోట్ల రూపాయలను గత మేలో స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement