Wednesday, April 24, 2024

Breaking | నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు.. షర్మిలకు బెయిల్​ మంజూరు

పాదయాత్రలో తనను అడ్డుకుని దాడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణుల వైఖరిని నిరసిస్తూ, దాడిలో ధ్వంసమైన కారును నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వెళ్లేందుకు యత్నించిన వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిలపై హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వీడియో రికార్డు చేస్తుంటే చేతితో కొట్టి ధ్వంసం చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. మంగళవారం సాయంత్రం దాకా ఎస్ ఆర్ నగర్ పీఎస్ లోనే షర్మిలను ఉంచిన పోలీసులు.. వైద్యులను పోలీస్ స్టేషన్ కే రప్పించి వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షర్మిలను రిమాండ్ కు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. అయితే షర్మిల ఏమీ తప్పు చేయలేదని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ కు వెళుతుంటే..పోలీసులు అకారణంగా ఆమెను అరెస్ట్ చేశారని షర్మిల తరఫు న్యాయవాదులు వాదించారు. పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని కూడా వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. షర్మిల తమపై దురుసుగా ప్రవర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు కోర్టుకు తెలిపారు. షర్మిల అసభ్య పదజాలం వినియోగిస్తున్న సమయంలో వీడియో తీసేందుకు యత్నించిన పోలీసు అధికారి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ చర్య ద్వారా షర్మిల పోలీసు అధికారి విధులను అడ్డుకున్నట్టేనని కూడా తెలిపారు.

- Advertisement -

షర్మిల, ఆమె అనుచరులు ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో హల్ చల్ చేశారని, శాంతి భద్రతలను పరిరక్షించేందుకే ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. షర్మిలను రిమాండ్ కు తరలించకుంటే నగరంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కూడా పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్​ మంజూరు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement