Wednesday, April 24, 2024

పొలంలో బ‌య‌ట‌ప‌డిన – నాలుగు వేల ఏళ్ల నాటి పురాత‌న వ‌స్తువులు

నాలుగు వేల ఏళ్ల నాటి పురాత‌న వ‌స్తువులు..ఆయుధాలని గుర్తించాడు ఓ రైతు. యూపీలోని మొయిన్ జిల్లా కుర‌వాలి మండ‌లం గ‌ణేశ్ పుర గ్రామంలో ఈ నెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఆక‌స్మాతుగా ఓ పురాత‌న పెట్టే బ‌య‌ట‌ప‌డింది. అందులో పురాతన కాలం నాటి బాణాలు, బాకులు, కత్తులతో నిండి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దాదాపు 77 రాగి వస్తువులను స్వాధీనం చేసుకుని.. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసింది. అక్కడ రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు.ఘటనా స్థలం నుంచి పురావస్తు శాఖ బృందం దాదాపు 77 ఆయుధాలను గుర్తించినట్లు ఎస్‌డిఎం కురవలి వీరేంద్ర కుమార్ మిట్టల్ తెలిపారు. ఆ వ‌స్తువుల‌ను ఆర్కియాల‌జీ బృందం స్వాధీనం చేసుకుంది.

మెరుగైన సమాచారం కోసం.. బృందం ఈ ఆయుధాలను పరిశోధనకు పంపింది. ప్రాథమిక విచారణ అనంతరం ఈ పొలంలో దొరికిన ఆయుధాలు దాదాపు 4000 ఏళ్ల నాటివని పరిశోధకులు తెలిపారు. ఇందులో స్టార్ ఫిష్ ఆకారంలో ఉన్న కొన్ని ఆయుధాలు, 4 అడుగుల పొడవున్న ఆయుధాలు, 16 మానవ బొమ్మలు ఉన్నట్లు వెల్లడించారు.వీటిలో 3 రకాల కత్తులతోపాటు ఈటెలు లభ్యమయ్యాయి.ఈ రాగి వస్తువుల స్వచ్ఛత 98 శాతం వరకు ఉంటుందని తెలిపారు. క్రీస్తుపూర్వం1800 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య కాలంలో ఇక్క‌డ ప్ర‌జ‌లు నివ‌సించి ఉంటారని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.పురాతన కాలంలో.. మెయిన్‌పురి ప్రాంతంలో రుషులు తపస్సు చేసినట్లు ప‌లు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప‌లుమార్లు తొమ్మిది, పదో శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులు ల‌భ్య‌మ‌య్యాయి. అప్పటినుంచి చాల్కోలిథిక్ యుగంలో మెయిన్‌పురిలో ప్రజలు జీవించి ఉన్నారని ఇక్క‌డ ప్ర‌జ‌లు న‌మ్ముతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement