Tuesday, April 16, 2024

APS RTC : క‌లిసొచ్చిన పండుగ సీజ‌న్‌.. దసరా వేళ రూ.10.20 కోట్ల ఆదాయం..

అమరావతి : దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.10.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల కోసం గత నెల 24 నుంచి ఈ నెల 10వరకు ప్రత్యేక సర్వీసులు నడిపామన్నారు. ప్రయాణికుల కోసం ఏ రూటులోనూ అసౌకర్యం లేకుండా పక్కా ప్రణాళికతో ప్రత్యేక సర్వీసులు నడిపి నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మాదిరి కాకుండా సాధారణ చార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడపడంతో సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలకు స్వస్తి చెప్పి ప్రయాణికులు ఆర్టీసీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారన్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వే షన్లు ప్రయాణికులు ఎక్కువగా చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన పట్టణాలకు దసరాకు రాకపోకలు సాగించే ఆర్టీసీ సర్వీసులనే ఎంచుకోవడం ముదాహవమన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవా ల్లో విజయవాడ శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, భవా నీలు అత్యధికంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారన్నారు. గత ఏడాది 50 శాతం అదనపు చార్జీలతో 2,400 ప్రత్యేక సర్వీసులు నడపగా రూ.5.40 కోట్ల ఆదా యం వచ్చిందన్నారు. ఇదే ఈ ఏడాది అదనపు చార్జీలు లేకుండా 4,504 ప్రత్యేక సర్వీసులు వివిధ రూట్లలో నడపగా రూ.10.20 కోట్ల ఆదాయం రావడం ప్రయాణికుల ఆదరణకు నిదర్శనమన్నారు. ఆర్టీసీని ఎంతగానో ఆదరించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపిన ఎండీ తిరుమలరావు, కార్గీక మాసంలో పంచారా మాలు, శబరిమల పుణ్యక్షేత్ర దర్శనాలు, కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదక్షణకు ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను సైతం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement