Tuesday, April 16, 2024

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికల ప్రక్రియను సమర్ధించిన ధర్మాసనం.. కౌంటింగ్ కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే, పరిషత్ ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సరైన కాలపరిమితి లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం మే 21న న్నికలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టం చేశారు.  సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేశారు. . వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ తీర్పును వెల్లడించింది.

కాగా, ఈ ఏడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తగిన సమయం లేదనందున పరిషత్ ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వానికి, అటు ఎస్ఈసీకి మధ్య యుద్ధం నడిచింది. అనంతరం నిమ్మగడ్డ మార్చి 31న పదవీ విరమణ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎస్ నీలం సాహ్నీని ఎస్ఈసీగా నియమించింది. ఆమె ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేసిన శాడిస్ట్ అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement