Wednesday, April 24, 2024

Telangana | దావోస్ వేదికగా మరో భారీ పెట్టుబడి.. 2 వేల కోట్లతో హైపర్ స్కేల్ డేటాసెంటర్  ఏర్పాటు

డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటుకానుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఏయిర్ టెల్ ఈ డేటాసెంటర్ ను నెలకొల్పుతోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పన కోసం 2వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతామని ఏయిర్ టెల్ ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న  ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలీయన్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో భారతీ ఏయిర్ టెల్ వ్యవస్థాపకుడు – చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ చైర్మెన్- మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ భేటీ తరువాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.

ఇక.. 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే డేటాసెంటర్ రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కె..రామారావు మాట్లాడుతూ.. “ఎయిర్‌టెల్‌ -నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. భారతదేశంలో హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ హబ్ మారిందని, ఎయిర్‌టెల్  తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను. ఏయిర్ టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాను.  రాష్ట్రంలో వేగంగా  అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏయిర్ టెల్- నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది.” అన్నారు.

భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు – ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ:- “హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా పని చేసింది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము”. అన్నారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement