Thursday, March 28, 2024

పెరిగిన అమెరికా టికెట్‌ రేట్లు.. విద్యార్థులపై భారం

తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయి. యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఇది శరాఘాతంగా పరిణమించింది. కరోనా పరిస్థితులతో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటం, మన దేశం నుంచి ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా ఉంది. కొవిడ్‌ వైరస్‌ రెండో దశ విజృంభణ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా నుంచి మాత్రం విమానాల రాకపోకలు సాగుతున్నాయి. అదీ ఆ దేశ పౌరులు, విద్యార్థి వీసా ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తోంది. అమెరికాతోపాటు మనదేశంలోనూ కరోనా రెండో దశ తీవ్రత తగ్గుముఖం పట్టటంతో ఢిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలోని కాన్సులేట్‌ కార్యాలయాలను గడిచిన నెల నుంచి తెరిచింది.     

ఈ నెల చివరి వారం, ఆగస్టులో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. భారీ సంఖ్యలో స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలకు స్లాట్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లో స్లాట్లు లభించని తెలుగు విద్యార్థులు ఢిల్లీ, ముంబైలో ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఈదఫా అధిక శాతం విద్యార్థులకు వీసాలు లభించినట్లు సమాచారం. దీంతో ఆ విద్యార్థులంతా అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమవుతుండటంతో విమాన టికెట్లకు గిరాకీ ఏర్పడింది.               

ఇదిలా ఉంటే యూఎస్‌కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్యా తక్కువగా ఉండటంతో టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లేందుకు రూ.60 వేలుగా ఉండే ఎకానమీ తరగతి టికెట్‌ ధర ప్రస్తుతం రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది. అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌, ఎయిర్‌ ఇండియా, ఖతార్‌ ఎయిర్‌ లైన్స్‌లో ఎయిర్‌ ఇండియా నడుపుతున్న విమానాల్లో మాత్రమే టికెట్‌ ధర కొంచెం తక్కువగా రూ.90 వేలు ఉంది.

కరోనా డెల్టా రకం భారతదేశం నుంచి వచ్చేవారి ద్వారా సోకుతోందన్న అపోహలు విస్తృతంగా ఉండటంతో రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా వెళ్లే విమానాల్లో అధిక శాతం దుబాయ్‌,దోహా, బ్రిటన్‌లలో ఏదో ఒక మార్గం నుంచి వెళుతుంటాయి. దుబాయ్‌, బ్రిటన్‌ దేశాలు భారతదేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులకు ఆగేందుకు(ట్రాన్సిట్‌) అవకాశం లేకుండా గతంలో ఆంక్షలు విధించాయి. తాజాగా ఆ ఆంక్షలను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగించటంతో ఎమిరేట్స్‌,ఎతిహాద్‌ సంస్థలు తమ సర్వీసుల రద్దును పొడిగించాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో నేటి నుంచి పెరగనున్న భూముల ధరలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement