Thursday, April 25, 2024

’పద్మ‘ మాకొద్దు, ఇప్పుడా ఇచ్చేది.. చాలా లేటయ్యింది.. పెరుగుతున్న తిరస్కరణలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను తిరస్కరించేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ తబలా వాద్యకారుడు పండిట్ అనింద్య ఛటర్జీ  పద్మ పురస్కారాన్ని తిరస్కరించారు.. బెంగాళి సంగీత కళాకారిణి లెజెండ్ సంధ్యా ముఖర్జీ కూడా పద్మ పురస్కారాన్ని తిరస్కరించినవారిలో ఉన్నారు. కాగా, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్,  ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ వంటి క్లాసికల్ మీస్ట్రోలతో `జుగల్ బందీలు’ (యుగళగీతం) పాడిన ప్రముఖ పెర్కషన్ వాద్యకారుడు, కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ గౌరవాన్ని స్వీకరించడానికి నిరాకరించారు.

పండిట్ అనింద్య ఛటర్జీ బుధవారం మాట్లాడుతూ ఈ గౌరవాన్ని స్వీకరించడానికి తన సమ్మతిని కోరుతూ మంగళవారం ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అయితే దీన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, ధన్యవాదాలు కూడా చెప్పినట్టు తెలిపారు. నా కెరీర్‌లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. తాను ఇప్పటికే ఆ దశ దాటానని 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఛటర్జీ అన్నారు.

పదేళ్ల క్రితమే తనకు ఈ గౌరవం అందజేసి ఉంటే కృతజ్ఞతతో స్వీకరించేవాడినని ఛటర్జీ చెప్పారు. “నా సమకాలీనులు, జూనియర్లలో చాలా మందికి సంవత్సరాల క్రితం పద్మశ్రీ లభించింది. ఏది ఏమైనప్పటికీ నేను చాలా వినయంగా చెబుతున్నాను.. నన్ను క్షమించండి. కానీ ఇప్పుడు దానిని (అవార్డు) అంగీకరించలేను” అని చటర్జీ స్పష్టం చేశారు. కాగా, సింగింగ్ లెజెండ్ సంధ్యా ముఖర్జీ మంగళవారం సాయంత్రం తనకు కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ అవార్డు ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ కళాకారిణి కుమార్తె సౌమీ సేన్‌గుప్తా మాట్లాడుతూ “90 ఏళ్ల వయస్సులో తన తల్లిలాంటి దిగ్గజానికి పద్మశ్రీని ప్రదానం చేయడం చాలా అవమానకరం” అని అందుకే తన తల్లి ఈ గౌరవాన్ని తిరస్కరించిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement