Thursday, April 18, 2024

దేశానికి కాబోయే మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాల కోసం తొమ్మిది మంది పేర్లతో కూడిన జాబితాను సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం ఆమోదం తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తుతం తొమ్మిది మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జడ్జ్‌ల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది.

ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం ఆమోదించిన జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. కర్ణాటక హైకోర్టుకు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్, సిక్కమ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇద్దరు కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కొలీజియం అమోదించిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. తొమ్మిది మందిలో జస్టిస్ నాగరత్న సహా ముగ్గురికి భారత ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టే అవకాశం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టుకు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అయ్యే అవకాశం ఉంది. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి అయిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో నియామకాల కోసం ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వానికి పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చిన గత 21 నెలల్లో ఇది మొదటి కొలీజియం. చివరిసారిగా 2019 నవంబరులోనే కేంద్రానికి న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఒక్క పేరును కూడా సిఫార్సు చేయలేదు.

ఇది కూడా చదవండిః తెలుగు రాష్ట్రాలకు రూ.లక్ష జరిమానా విధించిన సుప్రీం కోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement