Thursday, April 25, 2024

ఆపద వేళ స్నేహ హస్తం… స్నేహితుడి కుటుంబానికి రూ. 29 లక్షల చేయుత

స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది 2009 పోలీస్ బ్యాచ్.. 2009 సంవత్సరంలో పోలీస్ శాఖలో ఎస్ఐలుగా ఎంపికైన పోలీస్ అధికారులు వెల్ఫేర్ సొసైటీ గా ఏర్పడి ఆపద వేళ తమ బ్యాచ్ లోని మిత్రుల కుటుంబాలకు అండగా నిలుస్తూ పెద్ద మొత్తంలో ఆర్థిక చేయూత  అందిస్తున్నారు. 2009 బ్యాచ్ లో శిక్షణ పొందిన వారిలో ఎవరికి ఏ ఆపదోచ్చినా మిగతావారంతా మేమున్నామంటూ అండగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. 2009 లో పోలీస్ శాఖలో  ఎస్సైలు ఎంపికైన 1103 మంది ప్రస్తుతం పదోన్నతి పొంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్స్పెక్టర్ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం 2009 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారులు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. బ్యాచ్లో లో ఎవరికి కష్టం వచ్చినా ఆర్థికంగా చేయూతను అందించాలని నిర్ణయించుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో  ఆరు జోన్ లు ఉండగా ఒక్కో జోన్ కు ఇద్దరేసి అధికారులు బాధ్యత తీసుకొని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రూపు సభ్యుల కష్టసుఖాలు ఎప్పటికప్పుడు 1103 మందికి తెలిసేలా సమాచారం ఇస్తున్నారు. ఆపద వేళ తలా కొంత వేసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాచ్ లోని నలుగురు పోలీసు అధికారులు మృతిచెందగా వారి కుటుంబాలకు ఆర్థికంగా భారీ చేయూతనిచ్చారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే లో పనిచేస్తున్న రాఘవేందర్ గౌడ్  మృతి చెందగా గ్రూపు సభ్యులందరూ తోచినంత సహాయం అందించి జమచేసిన 29 లక్షల రూపాయలను మహబూబ్ నగర్ లో రాఘవేందర్ గౌడ్ దశదినకర్మ సందర్భంగా మృతుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరి పేరిట 14.5 లక్షల రూపాయల చొప్పున  అందజేశారు. గతం లో గ్రూపు సభ్యుడు అయిన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని తుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న అల్లు దుర్గారావు కరోనా బారిన పడి మృతి చెందిగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రూపులో సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సభ్యులు తోటి మిత్రుని కుటుంబానికి చేయూతనిచ్చేందుకు తోచినంత సహాయం చేశారు. 28 లక్షల రూపాయలు జమ కావడంతో మృతుని ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడంతోపాటు మృతుడి తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు భార్యకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. 27 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని జమ చేసి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం తో పాటు మృతుని తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు, భార్యకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. 2021 లో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్ భార్యతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు బ్యాచ్ సభ్యులు ముందుకు వచ్చారు.

తోటి మిత్రుని పిల్లలు అనాధలు కావద్దని భావించి 45 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని జమ చేశారు. మృతుడి ఇద్దరు పిల్లలకు తలా పది లక్షల రూపాయల చొప్పున 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను వారికి అందించారు. మృతుడి తల్లికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 20 లక్షల రూపాయలతో హైదరాబాదులోని అబ్దుల్లా పూర్ మేట్ లో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇద్దరు పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను కుటుంబ సభ్యులకు  అందజేశారు. రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువుల తో పాటు జన్మనిచ్చిన వారికి  ఆపద వస్తేనే దూరంగా ఉంటున్న సమాజంలో  తోటి స్నేహితుడి కుటుంబాలకు అండగా నిలుస్తూ దు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement