Friday, March 29, 2024

మోడీ కోసం రెండు వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌-ప్ర‌ధానితో అపాయిట్ మెంట్ కోసం వెయిటింగ్

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ కి చెందిన ఓ యువ‌కుడు ప్ర‌ధాని మోడీపై ఉన్న అభిమానంతో రెండు వేల కిలోమీట‌ర్ల‌కి పైగా పాద‌యాత్ర చేశాడు. పత్తిపాటి నరసింహ అనే యువకుడు హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.. ప్రధాని మోడీని ఆయన పుట్టిన రోజు సందర్భంగా కలవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రధాని బిజీగా ఉండటంతో ఆయన్ని కలవడం కుదరక నిరుత్సాహానికి లోనయ్యాడు. ఎన్ని రోజులు నిరీక్షించైనా సరే ప్రధానిని కలిశాకే తిరిగి వస్తానని చెప్పాడు. మోడీని కలవాలనే ఉద్దేశంతో జులై 17న బద్వేల్ నుంచి కాలినడకన బయల్దేరి.. 54 రోజులపాటు 2015 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సెప్టెంబర్ 8న ఢిల్లీ చేరుకున్నాడు. తాను 500 నుంచి 600 కి.మీ. అడవుల్లో నడిచానని.. 40 రోజులు వర్షంలోనే నడిచానని నరసింహ చెప్పాడు. వేరే పార్టీల వాళ్లు లక్ష రూపాయలు ఇస్తాం వెనక్కి వెళ్లిపోమన్నారని.. కానీ ప్రధాని మోడీపై తనకున్న అభిమానం వెలకట్టలేనిదన్నాడు.

ప్టెంబర్ 17న పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసేందుకు నరసింహ అపాయింట్‌మెంట్ కోరాడు. కానీ ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ వెళ్లి రావడం, మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లడంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు. ప్రధానిని కలిసేందుకు సెప్టెంబర్ 12నే పీఎంవో అపాయింట్‌మెంట్ కోరానని.. 3-4 రోజుల్లో సమాధానం చెబుతామన్నారని కానీ ఇంత వరకూ సమాధానం రాలేదని నరసింహ చెప్పాడు. తన పాదయాత్ర సమయంలో బీజేపీ కార్యకర్తలు వసతి కల్పించారని నరసింహ తెలిపాడు. తెలంగాణ దాటాక ఆహారం విషయంలో ఇబ్బందులు పడ్డానని… ఒక్కోసారి నిద్రించడానికి రూమ్ కూడా దొరికేది కాదని.. దీంతో గుళ్లో, పెట్రోల్ బంకుల్లో నిద్రించేవాడినని చెప్పాడు. తాను బద్వేల్ నుంచి డిల్లీకి వెళ్లడానికి రూ.20 వేల వరకూ ఖర్చయ్యిందన్నాడు. ‘మెదక్ జిల్లా నుంచి ఒకబ్బాయి రెండు రోజులపాటు నాతో వచ్చాడు. చివరి రెండు రోజులు జడ్చర్ల నుంచి కుమార్ అనే అబ్బాయి వచ్చి నాతో చేరాడు. తర్వాత తిరిగి వెళ్లిపోయాడు’ అని నరసింహ చెప్పాడు. నేను ఉండటం కోసం ఢిల్లీకి 23 కిలోమీటర్ల దూరంలో.. బీజేపీ నాయకులు ఒక రూం ఇచ్చారు. ఎన్నిరోజులైనా ఫర్వాలేదు.. ప్రధానిని కలిసే వస్తాను.

ఏపీ నాయకుల నుంచి నాకు సహకారం లభించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిశాను. ఆయన ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోమని చెప్పారు. ఆయన పీఏ మాత్రం అనవసరమైన శ్రమ ఎందుకు, ఇంటికెళ్లమన్నారని నరసింహ తెలిపాడు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. అలాంటి ప్రధాని ఇప్పటి వరకూ మనకు రాలేదు.. భవిష్యత్తులోనూ వస్తారనే నమ్మకం లేదు. ఆయన దేశాన్ని అభివృద్ధి పథంలోనే నడిపేలా పని చేస్తున్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ప్రధాని చొరవ తీసుకున్నారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ అమలు చేశారు. దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కృషి చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది త్యాగం చేశారు. అలాంటి తిరంగాను ఏ నాయకుడో ఎగరేయాలనే పరిస్థితి మారింది. ప్రతి సామాన్యుడు కూడా జాతీయ జెండాను ఎగరేయగలిగాడు. స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది’’ అని నరసింహ వ్యాఖ్యానించాడు. మ‌రి న‌ర‌సింహ మోడీని క‌లుస్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement