దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. ఇవాళ 1,573కు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,573 కొత్త కేసులు బయటపడ్డాయి.
దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,47,07, 525కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసులు 11వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం 10,981 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కరోనా కారణంగా ఒక్క కేరళలోనే నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,841కి చేరింది. మరోవైపు కరోనా మహమ్మారి నుంచి 4,41,65,703 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.