Thursday, April 25, 2024

భారత్ రావాలంటూ కమలా హారిస్‌ కు మోదీ ఆహ్వానం

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకమనీ, ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు.

భారత్-అమెరికా.. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, రెండూ ఒకేరకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్పారు.అధ్యక్షుడు బైడెన్, కమల నేతృత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కమలా హారిస్‌ను మోదీ భారత్ పర్యటనకు ఆహ్వానించారు.

అనంతరం కమలా హారిస్ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అన్నారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్ వనరుగా ఉందని చెప్పారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్ చేసిన ప్రకటనను కమల స్వాగతించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత మన దేశాలపైనే ఉందని కమల పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement