పెళ్లి చేసుకుని పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తుంటే ఏ అమ్మాయికైనా బాధ, దు:ఖం సహజం. తల్లిదండ్రులు, తోబుట్టువులను వదిలి వెళ్తుంటే వారికి పట్టరాని దు:ఖం వస్తుంది. ఒడిశాలో ఓ అమ్మాయి అలాగే ఏడ్చి ఏడ్చి తన ప్రాణం కోల్పోయింది. కాసేపట్లో అత్తింట్లో అడుగుపెట్టాల్సిన ఆమె.. తనకు పట్టరాని దు:ఖం రావడంతో గుండెపోటుతో చనిపోయింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనాపూర్ జిల్లా జులుందా అనే గ్రామంలో శుక్రవారం జరిగింది.
బాలానగర్ జిల్లా తెటెల్ గావ్కు చెందిన బిశికేశన్ అనే యువకుడితో గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోసీ సాహూకు శుక్రవారం వివాహం జరిగింది. పెళ్ల తంతు పూర్తయ్యాక బిడ్డను అత్తారింటికి పంపడం కోసం అప్పగింతలకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికూతురు రోసీ సాహూ అదేపనిగా ఏడ్చింది. దీంతొ నీరసించి కుప్పకూలి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. కాగా కొన్ని నెలల క్రితమే తండ్రి చనిపోవడంతో ఆమె తీవ్రమైన విషాదంలో ఉందని, ఆ అమ్మాయి మేనమామ, కొందరు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలే ఆమెకు ఈ పెళ్లి చేశారని జులుందా గ్రామస్థులు తెలిపారు.