Wednesday, April 17, 2024

వ్యూయర్ షిప్‌లో అదరగొట్టిన WTC ఫైనల్

ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన WTC ఫైనల్ మ్యాచ్ అభిమానుల మనసులను చూరగొన్నది.. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు క్రికెట్ ఆదరణ ఉన్న అన్ని దేశాల ప్రేక్షుకులు ఆసక్తి చూపించారు. తాజాగా అందుకు సంబంధించిన లెక్కలను ఐసీసీ విడుదల చేసింది. రెండేళ్ల ఛాంపియన్‌షిప్‌లో అన్ని సిరీసుల్లోనూ ఎక్కువ మంది చూసిన పోరుగా రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 177 మిలియన్ల వీక్షకులు భారత్‌, న్యూజిలాండ్‌ పోరును ఆస్వాదించారు. 89 ప్రాంతాల్లో 130.6 మిలియన్ల లైవ్‌ వ్యూయర్‌షిప్‌ లభించడం గమనార్హం.

భారత్‌లోనే ఫైనల్‌ను అత్యధిక మంది వీక్షించారు. స్టార్‌స్పోర్ట్స్‌, దూరదర్శన్‌ ద్వారా 94.6% మంది మ్యాచ్‌ చూశారు. స్థానిక భాషల్లోనూ వ్యాఖ్యానం రావడం పెరుగుదలకు దోహదపడిందని ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దహియా అన్నారు. అభిమానులకు మరింత వినోదం కల్పించేందుకు వివిధ వనరులపై పెట్టుబడులు పెడతామని ఆయన వెల్లడించారు. న్యూజిలాండ్‌లో తక్కువ జనాభా ఉన్నా వ్యూయర్‌షిప్‌ ఆకర్షణీయగానే ఉండటం విశేషం. దాదాపుగా 200,000 మంది రాత్రంతా మేల్కొని లేదా వేకువ జామునే లేచి ఫైనల్‌ పోరును వీక్షించారు. బ్రిటన్‌లోని స్కై స్పోర్ట్స్‌లోనూ 2019-2021 ఛాంపియన్‌షిప్‌ మ్యాచుల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ ఇదే కావడం ప్రత్యేకం. 2015 తర్వాత రిజర్వుడే నాడు అత్యధికమంది చూసిన ఇంగ్లాండ్‌యేతర పోరూ ఇదే.

ఐసీసీ.టీవీ ఓటీటీ ద్వారా 145 ప్రాంతాల్లో అదనంగా 6,65,100 ప్రత్యక్ష వీక్షణలు లభించాయి. మొత్తంగా 14 మిలియన్ల వీక్షణా నిమిషాలకు ఇది సమానం. రిజర్వుడే రోజు ఐసీసీ వేదికల ద్వారా వీడియో కంటెట్‌ను 500 మిలియన్లకు పైగా చూశారు. ఐసీసీ డిజిటల్‌ అసెట్స్‌లో ఫేస్‌బుక్‌ ద్వారానే 423 మిలియన్ల వ్యూస్‌, 368 మిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి. కేవలం ఒక రిజర్వ్‌ డే నాడే ఐసీసీ ఫేస్‌బుక్‌ పేజీలో 24 గంటల వ్యవధిలో 65.7 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు లభించాయి. 2020, మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ 64.3 మిలియన్ల కన్నా ఇది ఎక్కవే. ఐసీసీ ఇన్‌స్టా ద్వారానూ 70 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు వచ్చాయి. ఐసీసీ అన్ని డిజిటల్‌ ఖాతాల ద్వారా 515 మిలియన్ల వీడియో వ్యూస్‌ రావడమూ ఓ రికార్డే.

 ఇది కూడా చదవండి : CPGET నోటిఫికేషన్‌ విడుదల..ఇలా అప్లై చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement