Thursday, April 18, 2024

టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌.. రాహుల్‌ ద్రవిడ్‌కు కాస్త రెస్ట్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అయితే కేవలం న్యూజిలాండ్‌ టూర్‌కు మాత్రమే ఆయన హెడ్‌ కోచ్‌గా వ్యవహరి స్తాడు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా జట్టు ఇంటి ముఖం పట్టింది. ఇపుడు మరో పర్యటనకు సిద్దమవుతోంది. నవంబర్‌ 30న న్యూజిలాండ్‌ టూర్‌ ముగిసేవరకు ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. కాగా బంగ్లాదేశ్‌ టూర్‌ కల్లా ద్రవిడ్‌ తిరిగి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడు.

న్యూజిలాండ్‌ టూర్‌ ముగియగానే భారత జట్టు బంగ్లాదేశ్‌కు వస్తుంది. డిసెంబర్‌ 4 నుంచి బంగ్లాలో భారత టూర్‌ మొదలవుతుంది. కాగా ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల కూడా ఐర్లాండ్‌, జింబాబ్వే టూర్‌లకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టోర్నీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. భారత అండర్‌ 19 క్రికెట్‌ జట్టుకు కూడా లక్ష్మణ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించారు. గత ఫిబ్రవరిలో లక్ష్మణ్‌ పర్యవేక్షణలోనే భారత అండర్‌ 19 టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిచింది. కాగా కోచ్‌ ద్రవిడ్‌తో పాటే సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, కెఎల్‌ రాహుల్‌ , రోహిత్‌ శర్మకు కూడా న్యూజిలాండ్‌ టూర్‌ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ టూర్‌లో హార్థిక్‌ పాండ్యా టీ 20 టీమ్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ వన్డే టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement