Saturday, April 20, 2024

తొలి వన్డేలో టీమిండియా విక్టరీ

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుస వికెట్లు కోల్పోయారు. తొలుత ఓపెనర్లు జేసన్ రాయ్(46), జానీ బెయిర్‌ స్టో(94) ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే వారిద్దరూ అవుటైన తరువాత ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయింది. ప్రసీధ్ కృష్ణ 4 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 3, భువనేశ్వర్ 2 వికెట్లతో సత్తా చాటారు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (28; 42 బంతుల్లో 4×4), శిఖర్‌ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చెత్త బంతుల్నే వేటాడి 10 ఓవర్లకు 39/0తో జట్టును నిలిపారు. స్టోక్స్‌ వేసిన 16 ఓవర్లో దేహాని దూరంగా వెళ్తున్న బంతిని ఆడి హిట్‌మ్యాన్‌ వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోహ్లీతో కలిసి గబ్బర్‌ చెలరేగాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 102 బంతుల్లో 105 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. గబ్బర్‌ 68 బంతుల్లో, కోహ్లీ సైతం 50 బంతుల్లో అర్ధశతకాలు అందుకొన్నారు. జట్టు స్కోరు 169 వద్ద మార్క్‌వుడ్‌.. కోహ్లీని పెవిలియన్‌ పంపగా.. మరికాసేపటికే శ్రేయస్‌ అయ్యర్‌ (6; 9 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. శతకానికి చేరువైన గబ్బర్‌  నెమ్మదిగా ఆడాడు. సెంచరీకి 2 పరుగుల దూరంలో.. స్టోక్స్‌ షార్ట్‌పిచ్‌లో వేసిన 38.1వ బంతిని పుల్‌ చేయబోయి మోర్గాన్‌కు చిక్కాడు.

ఇంగ్లాండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయడం.. హార్దిక్‌ (1; 9 బంతుల్లో) ఔటవ్వడం.. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడంతో టీమ్‌ఇండియా 270 మార్క్‌ దాటుతుందా అనిపించింది! కానీ.. నిలదొక్కుకోవడానికి ఆచితూచి ఆడిన రాహుల్‌ కాసేపయ్యాక విజృంభించాడు. సొగసైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. ఫామ్‌లోకి రావాలన్న ఆత్మవిశ్వాసంతో మెరుపు షాట్లు కొట్టాడు. అతడికి తోడుగా అరంగేట్రం ఆటగాడు కృనాల్‌పాండ్య బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయమైన 112 (61 బంతుల్లో) పరుగుల సాధికారిక భాగస్వామ్యం అందించారు. ఆఖరి 5 ఓవర్లలో 67 పరుగులు సాధించారు. జట్టును 317/5తో నిలిపారు. మార్క్‌వుడ్‌ 3, బెన్‌స్టోక్స్‌ 2 వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement