Friday, April 26, 2024

పంత్ ఓ చిచ్చర పిడుగు..

 ప్రస్తుతం టీమిండియాలో ఏం నడుస్తోందటే…టక్కున వినిపించేపేరు రిషబ్ పంత్. ఈ యువ ఆటగాడు మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి మొన్నటి ఇంగ్లాండ్ సిరీస్ వరకు పంత్ తన పవర్ హిట్ రుచి చూపించాడు. ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. అందులోన కెప్టెన్ కూడా ఇంకెంముంది పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడని క్రికెట్ అనలిస్ట్ లు చెబుతున్నారు. శ్రేయాస్‌ అయ్యర్‌ గాయంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరమవడంతో మేనేజ్‌మెంట్‌ పంత్‌కు బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయ్యర్‌ సారధ్యంలో ఆరంభం నుంచి అదరగొట్టిన ఢిల్లీ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చతికిలపడింది.

కెప్టెన్‌గా 100 శాతం సక్సెస్ రేటు ఉన్న అజింకా రహానే, ఆస్ట్రేలియాకు సారథిగా వ్యవహారించిన స్టీవ్ స్మిత…సీనియర్ మోస్ట్ టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్, మోస్ట్ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, దేశవాళీలో ముంబై జట్టు కెప్టెన్ పృథ్వీషా.. ఇంతమంది ఉన్నా కెప్టెన్సీ పగ్గాలు దక్కించుకున్నాడు రిషబ్ పంత్. ఇక కాపిటల్స్ జట్టు సారధిగా పంత్ పేరును ప్రకటించడంపై అజార్ స్పందించారు. యువ ఆటగాడిగా, వికెట్ కీపర్ గా జట్టులో పంత్ అత్యంత కీలక ఆటగాడని కితాబునిచ్చారు. పంత్ సారధిగా కూడా రాణిస్తాడన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన అజారుద్దీన్, పంత్ గత కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతున్నాడని ప్రశంసించారు. సమీప భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ రేసులో అతని పేరు సెలక్టర్ల దృష్టిలో మిగతా వారితో పోలిస్తే ముందున్నా తాను ఆశ్చర్యపోనని అన్నారు. పంత్ దూకుడైన ఆటతీరు ఇండియాను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని అన్నారు.

తాజాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం.. ఆ జట్టును మరింత దూకుడుగా మార్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ ప్రాక్టీస్‌ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఢిల్లీ షేర్‌ చేసిన వీడియోలో.. మొదట పంత్‌ తన సహచరులతో షేక్‌హ్యాండ్‌ చేసి మైదానంలోకి దిగాడు. అనంతరం తనకే సొంతమైన ఆర్థడాక్స్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ ఆగయా.. పంత్‌ ఆన్‌ ఫైర్‌.. మ్యాన్‌ ఆన్‌ మిషన్‌… ప్రత్యర్థులకు ఇక చుక్కలే.. ఐపీఎల్‌ 2021.. అంటూ క్యాప్షన్‌ జత చేసింది. పంత్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పంత్‌ ఐపీఎల్‌లో 68 మ్యాచ్‌లాడి 2079 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న చెన్నై వేదికగా సీఎస్‌కేతో ఆడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement