Thursday, April 25, 2024

Cricket: ర్యాంకింగ్స్‌లో మళ్లీ దూసుకెళ్లిన కోహ్లీ.. టాప్​ టెన్​లో దక్కిన స్థానం

టి20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తల పడిన టీమిండియా జట్టు సభ్యుడు విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో టీ 20 బ్యాటింగ్‌ ర్యాకింగ్స్‌లో మళ్లి దూసుకెళ్లాడు. ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ టెన్‌లో కోహ్లీకి స్థానం దక్కింది. ప్రస్తుతం కోహ్లీ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. పాక్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం దాయాది పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు సాధించడమే. మెల్‌ బోర్న్‌లో చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌తో టీమిండియా గెలవడానికి దోహదపడింది.

33 ఏళ్ల కోహ్లీ ఆ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు కొట్టాడు. 53 బంతుల్లో 82 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అతను ఐసీసీ టి 20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో అయిదు స్థానాలు ముందుకు వచ్చేశాడు. ఇక బుధవారం రిలీజైన ర్యాంకింగ్స్‌ లిస్టులో కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ప్రస్తుతం టీ 20 బ్యాటర్స్‌ లిస్టులో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై 92 రన్స్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే రెండో స్థానాన్ని ఆక్రమించేశాడు. రిజ్వాన్‌ 849 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలువగా ఇప్పుడు ఆ స్థానంపై పలువురు బ్యాటర్లు కన్నేశారు. సూర్యకుమార్‌ను కాన్వే దాటేశాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, సౌతాఫ్రికా బ్యాటర్‌ మార్‌ క్రమ్‌లు కూడా టాప్‌ ప్లేస్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement