Wednesday, April 24, 2024

అండర్‌-19 ప్రపంచకప్‌… భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్ తుదిపోరు

వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు అంటిగ్వా వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో యువ భారత్‌ తలపడనుంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత్‌ వరుసగా నాలుగోసారి ఫైనల్లోకి అడుగుపెట్టడం విశేషం. సెమీస్‌ పోరులో భారత్‌ విజయంలో కెప్టెన్‌ యష్‌ ధుల్‌ సెంచరీతో కీలకపాత్ర పోషించాడు. కరోనా సృష్టించిన ఆటంకాలను విజయవంతంగా అధిగమించిన మన యువజట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో అదరగొడుతోంది. ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ సొంతం చేసుకునేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది. ‘భారత యువజట్టు ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2000లో కెప్టెన్‌ మొహమ్మద్‌ కైఫ్‌ సారథ్యంలో, 2008లో కెప్టెన్‌ కోహ్లీ, 2012లో ఉన్ముక్‌చంద్‌ సారథ్యంలో, చివరగా 2018లో కెప్టెన్‌ పృథీషా ఆధ్వర్యంలో భారత్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. 2006, 2016, 2020లో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా గత ప్రపంచకప్‌లో భారతజట్టు బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలై త్రుటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. మరోవైపు 1998 తరాత ఇంగ్లండ్‌ యువ జట్టు ఫైనల్‌కు చేరింది. 24ఏళ్ల అనంతరం తొలిసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే.. 1998లో ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచి విజేతగా నిలిచింది.

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య అంటిగ్వా వేదికగా జరిగే టైటిల్‌ పోరు భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.30కు ప్రారంభం కానుంది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లు మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించనున్నారు. 2022 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టును కరోనా వేధించినా టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్‌ యష్‌, వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ తదితరులు ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు కరోనా బారిన పడటంతో ఆ మ్యాచ్‌కు కేవలం 11మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే టీమిండియా ఐర్లాండ్‌పై ఏకంగా 174పరుగులు తేడాతో గెలిచి భారతసత్తా చాటి భళా అనిపించుకుంది. భారత్‌-ఇంగ్లండ్‌ యువజట్లు ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా యువ భారత్‌ 5-2తేడాతో ముందంజలో ఉంది. అయితే భారత్‌-ఇంగ్లండ్‌ జట్టు తుదిపోరులో తలపడటం ఇదే తొలిసారి. ఫామ్‌లో ఉన్న టామ్‌ ప్రీస్ట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టులో ఎడమచేతివాటం పేసర్‌ జాషువా బోడెన్‌, స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ కీలకం కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement