Friday, March 29, 2024

అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురిది ఓ వర్గం : అజారుద్దీన్..

హెచ్ సీఎ లో వివాదం ముదురుతోంది. తనకు ఇచ్చిన నోటీసులపై హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందించారు. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారని ఆరోపించారు. వారి అవినీతిని అడ్డుకుంటున్నాననే తనకు ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తానెప్పుడూ హెచ్ సీఏ గౌరవాన్ని తక్కువ చేయలేదన్నారు. హెచ్ సీఏలో అవినీతిని అరికట్టేందుకు సమర్ధులైన వ్యక్తిని అంబుడ్స్ మన్ గా నియమించాలని కోరితే.. వారే తప్పుబట్టారన్నారు. వారు హెచ్ సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, తాను అడ్డుకుంటుంటే రివర్స్ లో తనపైనే బురదజల్లుతున్నారని ఆయన చెప్పారు. ఆ ఐదుగురే నోటీసులిచ్చి అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ఇవాళ్టి నుంచి హెచ్ సీఏకి అధ్యక్షుడు అజర్ కాదని, దీంట్లో బీసీసీఐ జోక్యం ఉండబోదని అపెక్స్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. సమావేశాలకు అధ్యక్ష హోదాలో ఆయన రాబోరని స్పష్టం చేసింది. జస్టిస్ లోధా కమిషన్ సిఫార్సుల మేరకు అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చామని ప్రకటించింది. కౌన్సిల్ లోని సభ్యుల్లో ఐదుగురు ఆ నిర్ణయం తీసుకున్నారని, వారిని ‘ఓ వర్గం’ అని పోల్చడం మంచిది కాదని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement