Saturday, April 20, 2024

ఆసీస్ ఆటగాళ్లకు మాల్దీవులే దిక్కు

ఐపీఎల్ అర్ధంతరంగా నిలిచిపోయింది. వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లతో కలిపి దాదాపు 40 మంది వరకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండి పోయారు. భారత్ లోనే ఉండిపోదామంటే ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. అటు ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానాలు లేవు. భారత్ నుంచి ఆస్ట్రేలియా వస్తే జైలు శిక్షేనంటూ ప్రధాని స్కాట్ మారిసన్ చేసిన ప్రకటనతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలు మే 15 వరకు నిషేధించిన నేపథ్యంలో, ఆసీస్ ఆటగాళ్లకు కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురుకాలేదని కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించే ప్యాట్ కమిన్స్ వాపోయాడు. గతంలో ఆస్ట్రేలియాను వీడితే తిరిగొచ్చేటప్పుడు 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఉండేదని, ఇప్పుడు అందుకు కూడా అనుమతించడంలేదని విచారం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో వారికి మాల్దీవులు చిరు ఆశలు కల్పిస్తోంది. మొదట భారత్ నుంచి మాల్దీవులు చేరుకుంటే, అక్కడి నుంచి స్వదేశం వెళ్లే మార్గం ఆలోచించవచ్చని ఆస్ట్రేలియా క్రికెటర్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ భారత్ ను వీడి మాల్దీవులు చేరుకున్నాడు. ఇప్పుడతడి బాటలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవుల బాటపట్టే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోయినా, కనీసం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత్ నుంచి దూరంగా వెళ్లొచ్చన్న భావనలో వారిలో కలుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement