Thursday, April 25, 2024

Cricket | ఈ వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. ప్ర‌శంస‌లు కురిపించిన స‌న్నీ

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా చేప‌ట్టిన తొలి సారే ఆ జ‌ట్టును చాంపియన్ గా నిలిపాడు హార్దిక్ పాండ్యా.. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున అవకాశం వచ్చినప్పుడల్లా టీ20 జ‌ట్టుకు నాయకత్వం వహిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక‌.. 17వ తేదీ నుంచి ఆసీస్ తో జ‌రిగే మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేకు రోహిత్ శర్మ గైర్హాజరీ కానుండ‌గా.. హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ధ‌నాధ‌న్‌ పాండ్యాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు టీ20 క్రికెట్లో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని తెలిపారు. “టీ20 స్థాయిలో హార్దిక్ కెప్టెన్సీ నన్ను ఎంతో ఆకట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ ను విజయపథంలో నడిపించడమే కాదు, టీ20ల్లో టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం దొరికిన ప్రతిసారీ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత్ గెలిస్తే 2023 వరల్డ్ కప్ తర్వాత భారత్ కెప్టెన్ రేసులో పాండ్యానే ముందు నిలుస్తాడు” అని స‌న్నీ (సునీల్ గ‌వాస్క‌ర్‌) చెప్పారు.

అంతేకాకుండా.. భారత జట్టు మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడి అవసరం ఎంతో ఉంటుందని స‌న్నీ అభిప్రాయపడ్డారు. ఆట స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడు పాండ్యా అని పేర్కొన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకెళ్లి ఆడగల సత్తా ఉన్న ఆటగాడు అని కొనియాడారు. తాను సరిగా ఆడకుండా, జట్టులోని ఇతర ఆటగాళ్లు బాగా ఆడాలంటూ ఒత్తిడి చేసే రకం కాదని పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించారు. బాధ్యతలు అందుకోవడానికి వెనుదీయని లక్షణం పాండ్యాను ప్రత్యేకంగా నిలుపుతుందని స‌న్నీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement