Friday, April 19, 2024

ఐపీఎల్‌ 2021 వేదికలపై కొనసాగుతున్న రచ్చ….?

కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 2021 సీజన్‌ మ్యాచుల నిర్వహణ లీగ్‌ యాజమాన్యానికి, బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారేటట్లుంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ని దష్టిలో పెట్టుకుని లీగ్‌ను కొన్ని నగరాల్లో మాత్రమే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగానే దేశంలోని ఐదు నగరాల్లో మాత్రమే ఐపీఎల్‌ నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. దిల్లి, అహ్మదాబాద్‌, కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేసింది. అయితే అప్పటినుంచే అసలు రచ్చ మొదలైంది. లీగ్‌లో ప్రాతినిధ్య వహిస్తున్న ప్రతి జట్టు కూడా తమ సొంత నగరాల్లో మ్యాచ్‌ ఉండాల్సిందేనని ఆయా ప్రాంచైజీలు బీసీసీఐకి మొరపెట్టుకుంటున్నాయి.

అయితే ఇప్పుడు ఐపీఎల్‌ వేదికల వివాదం మరో మలుపు తీసుకోనుంది. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమంతిచకపోయినట్లయితే…. ఆయాప్రాంతాల్లో మ్యాచులను నిర్వహించవచ్చనేది కింగ్స్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా బీసీసీఐకి ప్రతిపాదించాడు. ఏ ప్రతిపాదికన మొహలీని ఐపీఎల్‌ వేదికల జాబితాలో ఎంపిక చేయలేదో తెలుసుకోవాలనుకున్నట్లు ఆయన చెప్పాడు. మొహలీని ఐపీఎల్‌ జాబితాలో చేర్చకపోవడం బాధ కలిగించిందన్నారు నెస్‌ వాడియా. ఈ నిర్ణయం వల్ల సొంత గడ్డపై ఆడడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కొన్ని జట్లు పొందలేకపోతాయన్నారు. కోవిడ్‌ ప్రభావం ఇంకా ఉన్నందున సీజన్‌ ఆరంభ మ్యాచులకు స్టేడియంలోకి అభిమానులకు అనుమతించపోవడమే మంచిదని…టోర్నీ గడుస్తున్న కొద్దీ ఈ నిబంధనలు సడలించవచ్చన్నారు.

ఇక మొహలీని ఐపీఎల్‌ నిర్వహణ వేదికలో చేర్చాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ బీసీసీఐకి విజ్ఞప్తి
చేశారు. ఈ విషయమై బీసీసీఐ మరోసారి పునరాలోచించాలని అమరీందర్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా ఐపీఎల్ నిర్వహణ వేదికల్లో హైదరాబాద్‌ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు….కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ వేదికలపై బీసీసీఐ తుది నిర్ణయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement