Thursday, March 28, 2024

టీడీపీని జూ.ఎన్టీఆర్ కూడా కాపాడలేడు!

తెలుగు దేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కూడా కాపాడలేదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటి దురద ఎక్కువ అని అన్నారు తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిచాలని కోరారు. ప్రజలు అభ్యర్థిని చూసి కాదు, సీఎం జగన్ ను చూసి ఓట్లు వేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ కారెక్టర్ లేని వ్యక్తి అని, ఒక్కోసారి ఒకో విధంగా మాట్లాడుతారని విమర్శించారు. తనకు కులం లేదంటూనే..మళ్లీ తన కులానికి అన్యాయం జరుగుతుందని అంటున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి ఎన్నడూ నోరు జార లేదని, అలాంటి వారికి తమ్ముడుగా ఉన్న పవన్ కు ఎందుకు నోటి దురద అని ప్రశ్నించారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ వైపు ఉన్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ ఒక సిద్దాంతం లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ప్యాకేజీ పవన్ గా మారిపోయారని విమర్శించారు. సుస్థిరమైన నాయకత్వం ఉన్న వారినే ఆంద్ర ప్రజలు మద్దతు తెలుపుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చిన్న పిల్లోడు కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని లక్ష్మీ పార్వతీ హితవు పలికారు.

ఇక, జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనం అయిందన్నారు. నాడు ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో టీడీపీని స్థాపించారో.. దానిని నేడు చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా.. బాగు చెయలేడని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఏమి మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదని విమర్శించారు. తెలుగు దేశం అభ్యర్థి గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధర తగ్గిస్తామని అంటున్న నారా లోకేష్ కు.. కనీస అవగాహన లేదన్నారు. లోకేష్ ని చూసి అందరు నవ్వుకుంటున్నారని లక్ష్మీ పార్వతీ ఎద్దేవా చేశారు‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement