Friday, April 26, 2024

సైదాబాద్ చిన్నారి కుటుంబానికి మద్దతుగా వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబసభ్యులను వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఇంతవరకు పోలీసులు పట్టుకోకపోవడం దారుణమని షర్మిల మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పాల్పడినవాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్ పెంపుడు కుక్క చనిపోతే ఒక అధికారిపై చర్యలు తీసుకున్నారని… బయట చిన్నారులు చనిపోతుంటే కేసీఆర్ కు పట్టదా? అని ప్రశ్నించారు. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై షర్మిల మండిపడ్డారు. కనీస సమాచారం కూడా లేకుండానే ట్వీట్ చేసి సమాజాన్ని కేటీఆర్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కేటీఆర్ మంత్రి కావడం మన ఖర్మ అని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్నప్పటికీ… ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ సరిగ్గా స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి, మందుకు అడ్డాగా మార్చారని అన్నారు. చిన్నారి చైత్రకు న్యాయం జరిగేంత వరకు తాను దీక్షను చేపట్టబోతున్నానని తెలిపారు. బాధిత కుటుంబం ఎదుటే షర్మిల దీక్షకు కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement