Thursday, April 25, 2024

లండన్‌లో సర్జరీ చేయించుకున్న హీరో సిద్ధార్థ్

బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో హీరో సిద్ధార్థ్‌కు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా తెలుగులో ఆఫర్లు తగ్గడంతో హీరో సిద్ధార్థ్ పూర్తిగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి సిద్ధార్థ్ నటించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన లభించింది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు శర్వానంద్, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు అజయ్ భూపతితో పాటు సాంకేతిక నిపుణులందరూ హాజరయ్యారు. హీరో సిద్ధార్థ్ మాత్రం హాజరుకాలేదు.

దీంతో సిద్ధార్థ్ ఎందుకు రాలేదనే అనుమానాలను అభిమానులు వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ రాకపోవడానికి కారణమేంటో ఇప్పుడు వెల్లడైంది. ప్రస్తుతం సిద్ధార్థ్ లండన్ లో ఉన్నాడు. అక్కడి ఓ హాస్పిటల్ లో చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి కూడా వెల్లడించారు. అయితే సిద్ధూకు వచ్చిన సమస్య ఏమిటి? ఏ సర్జరీ చేయించుకున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సోషల్ మీడియలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సిద్ధార్థ్ కూడా తన సర్జరీ విషయంపై ఇంత వరకు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం… సిద్ధార్థ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement