Friday, March 29, 2024

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తన భాష మార్చుకోవాలి: అంబటి

సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల శివప్రసాదరావు మరణానికి టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబే కారణమని ఆరోపించారు. కోడెల వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా వెనక్కు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడుకి పిచ్చి పట్టిందని.. అధికారం కోల్పోవడంతో అవాకులు చవాకులు పేలుతున్నారని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.

సీఎం జగన్‌ను పట్టుకుని అసభ్య పదజాలం వాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని.. అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని.. ఆయన వెంటనే భాషను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడుపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీడీపీకి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రావడం లేదని అంబటి విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement