Friday, April 26, 2024

సాగు చ‌ట్టాల విష‌యంలో త‌ప్పు చేశారు.. నష్టపరిహారం ఇవ్వాల్సిందే..

ప్ర‌భ‌న్యూస్ : మూడు వ్యవసాయ సాగు చట్టాల కారణంగా 700 మందికి పైగా అన్నదాతలు చనిపోయారని, వారి కుటుంబాకుల నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. రైతుల సమాచారం లేదంటూ కేంద్రం పేర్కొనడం సరికాదన్నారు. లోక్‌సభలో కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.సమాచారం లేదని చెప్పి.. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడం మానేస్తారా..? అని ప్రశ్నించారు. పరిహారం ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే.. డేటా లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తమ వద్ద జాబితా ఉందంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు. సాగు చట్టాల ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల పూర్తి జాబితా పంజాబ్‌ ప్రభుత్వం వద్ద కూడా ఉందన్నారు. 700 మంది రైతులు చనిపోవడానికి కేంద్ర ప్రభుత్వం వైఖరే కారణమని ఆరోపించారు.

ఒక పంజాబ్‌లోనే 403 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని రాహుల్‌ తెలిపారు. పంజాబ్‌ కాకుండా.. మిగిలిన ప్రాంతాలకు చెందిన 100 మంది రైతుల జాబితా తమ పార్టీ వద్ద ఉందని.. మరో 200 మంది జాబితా పబ్లిక్‌ రికార్డుల్లో ఉన్నట్టు తెలిపారు. రైతుల ఆందోళనలకు పంజాబ్‌ ప్రభుత్వం బాధ్యత లేకపోయినప్పటికీ.. ఈ పోరాటంలో మృతి చెందిన 403 మంది రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిందని గుర్తు చేశారు. 152 మంది రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మిగిలిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు. సాగు చట్టాల విషయంలో తప్పు చేసినట్టు ప్రధాని అంగీకరించారని, బహిరంగ క్షమాపణ కోరినా.. పోరాటంలో మరణించిన రైతులకు పరిహారం ఇవడానికి సమస్య ఏంటో తెలియజేయాలని రాహుల్‌ ప్రశ్నించారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement