Friday, March 15, 2024

అద్భత కళాఖండం ‘రామ కోటి వస్త్రం’.. పట్టుచీరపై 13 భాషల్లో జై శ్రీరామ్​ నామం..

ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి సత్య సాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన జురాజు నాగరాజు అనే నేతన్న అద్భుతమైన కళా ఖండాన్ని ఆవిష్కరించారు. 60 మీటర్ల పట్టు చీరపై 13 భారతీయ భాషల్లో ఏకంగా 32, 200 సార్లు ‘జై శ్రీరామ్’ అనే నామాన్ని డిజైన్ చేసి రూపొందించాడు. అంతేకాకుండా ఆ పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను సైతం డిజైన్ చేశాడు. నాగరాజు రూపొందించిన ఈ చీరను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్​గా మారింది. నాగరాజు రూపొందించిన ఈ ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని ‘రామ కోటి వస్త్రం’గా పిలుస్తున్నట్లు వివరించారు. ఈ పట్టు వస్త్రంపై రామాయాణంలోని సుందరకాండలోని 168 ఘట్టాలను కళ్లకు కట్టేలా రూపొందించినట్లు వెల్లడించాడు.

దీన్ని రూపొందించడం అంత సులువు కాదని.. దీని కోసం చాలా కష్టపడినట్టు నేతకారుడు నాగరాజు వివరించారు. ఖర్చు కూడా భారీగానే అయ్యిందని తెలిపాడు. ఈ పట్టుచీర దాదాపు 16 కిలోల బరువు ఉంటుందని, 44 ఇంచుల వెడుల్పు ఉన్న ఈ చీరను తయారు చేసేందుకు దాదాపు 4 నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. దీని కోసం సుమారు ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చయ్యిందన్నారు. ఈ చీరను రూపొందించేందుకు తనకు మరో ముగ్గురు సహాయం చేసినట్లు నాగరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement