Friday, April 26, 2024

ఉద్యోగాల్లో 35 శాతం పెరిగిన మహిళలు.. పెట్టుబడుల్లోనూ ముందంజ

మహిళలకు 2023 ఫిబ్రవరిలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు 35 శాతం పెరిగాయి. ప్రధానంగా వైట్‌ కాలర్‌ జాబ్స్‌లో మహిళా ఉద్యోగులకు డిమాండ్‌ పెరుగుతున్నది. ఎంప్లాయిమెంట్‌ వెబ్‌సైట్‌ ఫౌండిట్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) సెక్టర్‌లో మహిళలకు అత్యధికంగా 36 శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా పని చేసే ప్రాంతాల్లో జెంటర్‌ ఈక్వాలిటీ కనిపిస్తోందని తెలిపింది. ఐటీ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో మహిళలకు 35 శాతం అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. బ్యాంకింగ్‌, అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీస్‌లో 22 శాతం అవకాశాలు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో 20 శాతం, హాస్పటల్‌, హెల్త్‌కేర్‌, డయాగ్నస్టిక్‌ రంగాల్లో 8 శాతం మహిళల కు ఉద్యోగ అవకాశాలు పెరిగాయిని పేర్కొంది.

- Advertisement -

ఢిల్లి ఎన్‌సీఆర్‌లో అధికం

ఓపెన్‌ జాబ్‌ పొజిషన్‌లో మహిళలు ఢిల్లిd ఎన్‌సీఆర్‌లో 21 శాతం. ముంబైలో 15 శాతం, బెంగళూర్‌లో 10 శాతం, చెన్నయ్‌లో 9 శాతం, పుణేలో 7 శాతంతో లీడింగ్‌లో ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులైన మహిళల్లో 6 శాతం మంది తమ కెరియర్‌లో బ్రేక్‌ తీసుకుని మళ్లి వచ్చిన వారే ఉన్నారని ఫౌండిట్‌ తెలిపింది. ఫ్రీలాన్స్‌ చేస్తున్న మహిళలు మొత్తం ఉద్యోగాల్లో 4 శాతం వరకు ఉన్నాయి. ఇది వైట్‌ కాలర్‌ ఆర్ధిక వ్యవస్థలో గిగ్‌ ఆధారిత అవకాశాల పెరుగుదలను సూచిస్తుంది. మహిళలు ఉద్యోగాల్లో సృజనాత్మకంగా, కో-ఆపరేటివ్‌గా ఉండటంతో పాట, అత్యంత పోటీతత్వాన్ని ప్రదర్శించారని ఫౌండిట్‌ సీఈఓ శేఖర్‌ గ రిసా అభిప్రాయపడ్డారు. మహిళలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన సంక్షోభ సమయంలో సమర్ధవంతంగా మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను నిర్వహించారని ఈ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఈ విషయంలో చేయాల్సింది చాలా ఉందని, గమ్యస్థానం ఇంకా సుదూరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. కంపెనీలు వీరి శక్తిని మరింతగా వినియోగించుకునేలా వర్క్‌ మోడల్స్‌ను సరళీకరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అనుభవాన్ని బట్టి నాయకత్వ స్థానాల్లో మహిళలు 8 శాతం వరకు ఉన్నారు. ఇది గతంలో 6 శాతంగా ఉంది. మిడిల్‌ నాయకత్వ స్థానాల్లో 4 సంవత్సరాల వరకు అనుభవం ఉన్న మహిళ ఉద్యోగుల సంఖ్య మాత్రం 24 శాతం వరకు ఉంది. ఫ్రెషర్స్‌ విషయంలో వీరి వాటా 18 శాతంగా ఉంది. కాల్‌ సెంటర్స్‌, బీపీఎంల్లో 25 శాతం, ఐటీ కంపెనీల్లో 23 శాతం, హెచ్‌ఆర్‌ రోల్స్‌లో 18 శాతం మహిళల వాటా ఉంది.

స్థిరాస్తిలో మహిళల పెట్టుబడులు..

మహిళల దగ్గర డబ్బులుంటే బంగారం కొనేందుకు మొగ్గు చూపుతారని చాలా మంది భావిస్తుంటారు. అయితే 65 శాతం మంది మహిళలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నార ని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తెలిపింది. స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతామని 20 శాతం మంది, బంగారం కొంటామని 8 శాతం మంది, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని 7 శాతం మంది చెప్పారని తెలిపింది. మొత్తం 5,500 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాలని, అందులో సగం మంది మహిళలని పేర్కొంది. అనరాక్‌ నివేదిక ప్రకారం 45 లక్షలకు పైగా విలువైన ఇళ్లకు కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు 83 శాతం మంది మహిళలు చెప్పారు. 45-90 లక్షలధరలో ఉండే ఇళ్లు సౌకర్యంగా ఉంటాయని 36 శాతం మంది, 90 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు విలువైన ఇళ్లపై 27 శాతం మంది, కోటిన్నరకు మించిన నివాసాలను కొంటామని 20 శాతం మంది తెలిపారు. 45 లక్షల కంటే తక్కువ విలువ ఉన్న ఇళ్ల కొనుగుల పట్ల చాలా తక్కువ మంది ఆసక్తి చూపించారని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. నివసించేందుకు పెట్టుబడుల కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారి నిష్పత్తి 82:18 నుంచి 77:23కి మారినట్లు తెలిపారు. మహిళలు తప్పనిసరిగా ఇంటికి సహ యజమానిగా ఉండేలా రూపొందించిన ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన వారి పేరిట ఇల్లు ఉంటే రుణాల వడ్డీ, రిజిస్ట్రేషన్‌ సుంకంలో రాయితీల వంటివి మహిళల పేరిట ఇళ్ల నమోదుకు ఉపకరిస్తున్నాయని తెలిపారు.

రుణాల చెల్లింపుల్లోనూ బెస్ట్‌

రుణాలు తిరిగి చెల్లించడంలోనూ పురుషుల కంటే మహిళలు మెరుగ్గా ఉన్నారని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ (సీఐసీ) ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ తెలిపింది. రుణ చెల్లింపు సామర్ధ్యానికి దర్ఫణంగా నిలిచే క్రెడిట్‌ స్కోర్‌ పరంగా చూసినా 57 శాతం మంది మహిళలు ప్రైమ్‌ విభాగంలోకి వస్తే, పురుషులు 51 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. వ్యక్తిగత రుణాలతో పాటు, విలువైన సామాగ్రి కొనుగోలుకు రుణాలు తీసుకోవడంలోనూ మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. వ్యాపార రుణాల్లోనూ 32 శాతం మంది మహిళలే ఉన్నారు. దేశంలో 45.40 కోట్ల మంది మహిళలు ఉంటే, 2022 నాటికి 6.3 కోట్ల మంది రుణాలు తీసుకున్నారు. 2022లో ఎక్కువ మంది వ్యవసాయ రుణాలు, విలువైన వస్తువుల కొనుగోలుకు రుణాలు తీసుకున్నారు. మహిళల పేరిట ఇచ్చిన రుణాల మొత్తం 16 లక్షల కోట్లకు చేరాయని, మొత్తం రుణాల్లో ఇది 19 శాతానికి సమానమని తెలిపింది. 91.7 లక్షల మంది మహిళలు రుణాలు తీసుకోవడం ద్వారా ఈ విభాగంలో తమిళనాడు దేశంలోనే అగ్రభాగాన ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement