Friday, March 29, 2024

అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చిన మహిళ.. కుటుంబ సభ్యుల షాక్

విజయవాడలో ఓ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గిరిజమ్మ అనే మహిళ కరోనా కారణంగా విజయవాడ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమె చనిపోయిందంటూ మే 15న ఓ మృతదేహాన్ని ఆమె భర్తకు వైద్యులు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెకు అంత్యక్రియలను నిర్వహించారు. మే 23న ఆమె కుమారుడు రమేష్ కూడా కరోనాతో ఖమ్మం ఆసుపత్రిలో మృతి చెందాడు.

రెండు రోజుల క్రితమే తల్లి, కుమారుడికి కుటుంబసభ్యులు దశదినకర్మలను పూర్తి చేశారు. అయితే బుధవారం నాడు వారికి ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ జగ్గయ్యపేటలోని తన ఇంటికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చనిపోయారో కూడా నిర్ధారించుకోకుండానే మరొకరి మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారని ఆమె భర్త గడ్డయ్య మండిపడ్డారు. మరోవైపు గిరిజమ్మ రావడం కుటుంబసభ్యులకు సంతోషం కలిగించినప్పటికీ… కొడుకుని కోల్పోవడంతో గడ్డయ్య దంపతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో ఓవైపు ఆనందం, మరోవైపు విషాదం నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement