Thursday, April 25, 2024

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం : మంత్రి ఎర్రబెల్లి

హరిపిరాల, కర్కాల (తొర్రూరు) : ఇది రైతు ప్రభుత్వం. సీఎం రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో పంట నష్టాలను మంత్రి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. రైతులు నష్టపోకుండా చివరకు పంటలు కూడా కొనుగోలు చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారు అన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేద‌న్నారు. రైతుల‌కు అండగా ప్రభుత్వం ఉంటుంది. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటాం… పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం అన్నారు. ఇటీవలి అకాల వర్షాలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ ఆయా రైతులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూసిన రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలని తీరని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు విలపించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన మంత్రి ధైర్యాన్ని నింపుతూ భరోసానిస్తూ, అక్కున చేర్చుకున్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో గల ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులను పంట నష్టాలను పరిశీలించాలని ఆదేశించారని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తమతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement