Friday, April 19, 2024

యుద్ధం ఆగాలనే కోరుకుంటున్నాం.. చర్చలతోనే శాంతి స్థాపన: మంత్రి జైశంకర్‌

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం వెంటనే నిలిచిపోవాలనే తాము కోరుకుంటున్నామని, భారత్‌ హింసకు వ్యతిరేకం అని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇరు దేశాలను భారత్‌ కోరిందన్నారు. భారత్‌ ఏం చేసినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల యుద్ధ ప్రభావం భారత్‌పై స్వల్పంగా ఉందని, ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. భారతదేశ విదేశాంగ నీతి.. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి సభలో కూడా భారత్‌ ఓటింగ్‌కు దూరంగా ఉందని తెలిపారు. భారత్‌ సహా 13 సభ్య దేశాలు ఓటేయలేదని గుర్తు చేశారు.

రష్యా చేసిన ప్రతిపాదనకు దూరంగా ఉండటం ద్వారా.. ఉక్రెయిన్‌ రష్యా వ్యవహారంలో ఇండియా తన వైఖరిని స్పష్టం చేసిందన్నారు. రష్యా తరఫున ఓటేయకపోవడంతో భద్రతా మండలి తీర్మానం ఆమోదం కాలేదన్నారు. ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో వైద్య పరమైన సాయం అందించామని స్పష్టం చేశారు. 90 టన్నుల వస్తువులను అందజేసినట్టు వివరించారు. రష్యా, ఉక్రెయిన్‌ అధి నాయకత్వంతో భారత్‌ సంప్రదింపులు జరుపుతూనే ఉందన్నారు. ఇరు దేశాల ప్రధానులతో కూడా మోడీ మాట్లాడారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement