Saturday, April 20, 2024

అన్ని రాష్ట్రాల్లోనూ గెలవాల్సిందే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీకి 2023 అత్యంత కీలకమైన సంవత్సరమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అధినేతలు తేల్చిచెప్పారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న 9 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి తీరాల్సిందేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా తేల్చి చెప్పారు. చారిత్రాత్మక విజయాన్ని అందించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో దేశమంతటా అదే మాదిరిగా దూసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు మాట్లాడినట్టు తెలిసింది. తొలుత బీజేపీ జాతీయ కార్యాలయంలో ఉదయం గం. 10.00 నుంచి మధ్యాహ్నం గం. 2.00 వరకు జాతీయ పదాధికారుల సమావేశం జరిగింది.

అనంతరం సాయంత్రం గం. 4.00కు ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. అంతకంటే ముందు పటేల్ చౌక్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో చేపట్టి కన్వెన్షన్ సెంటర్ వరకు వచ్చారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ఎస్. జైశంకర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్‌ షో కు నీరాజనం పలుకుతూ పూలజల్లు కురిపించారు.

- Advertisement -

మోదీ స్ఫూర్తిగా.. గెలుపే శ్వాసగా

రెండ్రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తొలి రోజు పూర్తిగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో గెలుపొందడంపైనే చర్చ జరిగింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయతో పాటు పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపు వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. గత ఏడాది చివర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని తన సొంత భుజాలపై మోస్తూ పార్టీకి చరిత్రాత్మక ఘన విజయాన్ని అందించారని సమావేశంలో జేపీ నడ్డా కొనియాడారు. ప్రధానిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలు కీలకమని తెలియజేశారు.

నడ్డా పదవీకాలంపై జరగని చర్చ

బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడిపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు తొలుత ప్రచారం జరిగింది. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ సమావేశాల్లో ఆ అంశం గురించి చర్చించలేదని సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన నేపథ్యంలో జేపీ నడ్డాను మరో పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదంటూ తొలుత కథనాలు వెలువడ్డాయి. కానీ పార్టీ ఆయన్ను మరో పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

మోదీ హయాం.. ప్రగతి పథం

కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ఘనత గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని జేపీ నడ్డా చెప్పినట్టు తెలిసింది. మోదీ హయాంలో భారత దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో రెండవ అతి పెద్ద దేశం కాగా, వాహన తయారీ రంగంలో 3వ అతి పెద్ద దేశంగా ఉందని కొనియాడారు. ఇక దేశంలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ వేగం సగటున రోజుకు 12 కి.మీ నుంచి 37 కి.మీ వరకు పెరిగిందని గుర్తుచేశారు. కేవలం అభివృద్ధి పనులే కాకుండా నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తోందని, అలాగే ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తోందని చెప్పారు. ఇలాంటి అచీవ్‌మెంట్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధిష్టానం సూచించింది.

ప్రతిపక్ష విషప్రచారం

ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారానికి తెగబడ్డాయని బీజేపీ ఈ సమావేశాల్లో తీర్మానించింది. పెగాసస్, రాఫెల్ డీల్, ఈడీ మనీలాండరింగ్, సెంట్రల్ విస్టా, ఆర్థిక పరిస్థితి ఆధారంగా కల్పించిన రిజర్వేషన్లు, నోట్ల రద్దు సహా అనేకాంశాలపై విషప్రచారం చేశాయని ఆరోపించారు. న్యాయపోరాటంలో గెలిచి ప్రతిపక్షాల నోర్లు మూయించినట్టు నిర్మల సీతారామన్ వెల్లడించారు.

బూత్ సశక్తీకరణ్

దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ క్రమంలో తాము బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్‌లను గుర్తించి, బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లి అందరికీ అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వానికి అధిష్టానం సూచించింది. దేశంలో దాదాపు 72 వేల బూత్‌లను గుర్తించామని, 1.32 లక్షల బూత్‌లను బీజేపీ నాయకత్వం చేరుకుందని వెల్లడించారు. బూత్ సశక్తీకరణ్ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించడంపై ఈ సమావేశాల్లో చర్చించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement