Friday, March 29, 2024

టీఎస్‌ఆర్టీసీ శ్రీరామనవమి ఆఫర్‌.. 116 చెల్లిస్తే భక్తుల చెంతకే రాములోరి కల్యాణ తలంబ్రాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు నేరుగా అందజేయాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ ఆర్టీసీ కార్గో పార్సిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీసీతారాముల కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ సూచనలతో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో బుధవారం భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాల పోస్టర్‌ను టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్‌ ఆవిష్కరించారు. ఈసారి భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణంతో పాటు 12ఏళ్లకోసారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేకుకలకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి.

విశిష్టమైన రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను పొందాలని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్‌ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ ఆర్టీసీ కార్గో పార్సిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900 మొబైల్‌ నంబర్లలో సంప్రదించాలనీ, తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద నేరుగా కూడా ఆర్డర్‌లను స్వీకరిస్తారని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement