Thursday, April 18, 2024

వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ.. సునీత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రయల్ కోర్టులో జరుగుతున్న నేర విచారణ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా జరగడం లేదన్న పిటిషనర్ సునీత వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తూ.. హత్య వెనుక విస్తృతస్థాయిలో జరిగిన కుట్ర, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఆదేశించింది.

ఏ కేసులోనైనా స్వతంత్రంగా, నిష్పాక్షింగా నేర విచారణ జరపాలని కోరుకోవడం బాధితుల ప్రాథమిక హక్కు అని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా సాక్షులనే కాదు దర్యాప్తు జరుపుతున్న అధికారులను సైతం నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషనర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులో ప్రతివాదులైన సీబీఐ సైతం హత్యకేసు విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపింది.

మరో ప్రతివాదిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. మంగళవారం తీర్పు వెలువరిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నాం. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టుగా కూడా కనిపించాలి. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలున్నాయి. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం.

- Advertisement -

ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న విస్తృతస్థాయి కుట్ర బయటకు రావాలంటే తదుపరి లోతైన దర్యాప్తు కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో నేర విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నాం. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం” అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement