Thursday, April 25, 2024

TTD : తిరుమలలో డ్రోన్ దృశ్యాల కలకలం.. టీటీడీ ఏమందంటే.?

నో ఫ్లైజోన్‌గా ఉన్న తిరుమలలో డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణ కలకలం సృష్టిస్తుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో చెక్క‌ర్లు కొట్టింది. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు ఉన్న దృశ్యాలు, శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలు దగ్గరగా చిత్రీకరణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది.

వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తాం : టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్
శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టిటిడి సివిఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డ్రోన్ వీడియోపై స్పందించిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి
నో ఫ్లైజోన్‌గా ఉన్న తిరుమలలో డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరణపై టిటిడి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమ‌ల‌లో ఆనంద గోపురంపై చిత్రీకరణలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని, ఆ వీడియోను పెట్టిన వ్యక్తిని గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్‌ లోడ్‌ చేసినట్లు గుర్తించామన్నారు. వాస్తవాలను రెండు రోజుల్లో భక్తుల ముందు పెడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement