Friday, April 26, 2024

వేలంలో రూ.138 కోట్లు పలికిన బంగారు నాణేం

అమెరికాలో 20 డాలర్ల విలువైన అరుదైన బంగారు నాణెం రికార్డు స్థాయిలో రూ.138 కోట్ల ధర పలికింది. అలాగే బంగారు నాణెంతో పాటు అరుదైన స్టాంప్‌ సైతం భారీ ధరకు అమ్ముడైంది. 1933 నాటి డబుల్‌ ఈగిల్ బంగారు నాణెంను మంగళవారం న్యూయార్క్‌లో వేలం వేయగా.. గతంలో ఉన్న రికార్డులను బద్దలు కొట్టి అత్యధిక ధరకు అమ్ముడైంది. సోథెబై వేలంలో ఈ నాణెం రూ.73 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య అమ్ముడవుతుందని భావించినప్పటికీ ఈ నాణెం ధర కొత్త రికార్డు సృష్టించింది. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.138 కోట్లు. ఇదే వేలంలో ప్రపంచంలోనే అరుదైన ఓ స్టాంప్ కూడా 8.3 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది.

ఈ గోల్డ్‌ కాయిన్‌ను ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టువార్ట్‌ వీట్జమన్‌కు చెందిన ఈ నెల 8న వేలం వేశారు. 20 డాలర్ల ఈ బంగారు నాణెలను 1933లో తయారుచేసినా.. తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ డబుల్‌ ఈగల్‌ నాణెలను చలామణికి విడుదల చేయకుండా ఆపేశారు. నాణెలను కరిగించమని ఆదేశించారు. అప్పుడు బయటికి వచ్చిన రెండింటిలో ఇదొకటి. డబుల్‌ ఈగిల్‌పై ఒకవైపు లేడీ లిబర్టీ, రెండో వైపు అమెరికన్‌ ఈగిల్‌ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. 1794కు చెందిన ‘ఫ్లోయింగ్‌ హెయిర్‌’ అనే వెండి నాణెం 2013లో రూ.73 కోట్లకు అమ్ముడుపోయి అత్యధిక ధర పలికిన నాణెంగా రికార్డులకెక్కింది.

జూన్ 8న డబుల్‌ ఈగిల్‌ నాణెం రూ.138 కోట్లు పలికి ఆ రికార్డును తిరగరాసింది. అలాగే 1856లో జారీ చేసిన బ్రిటిష్‌ గయానా ఒకటో సెంట్‌ మెజెంటా స్టాంప్‌ను 8.3 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది. ఇది చరిత్రలో అత్యంత విలువైన స్టాంప్‌గా నిలిచింది. దక్షిణ అమెరికా దేశం ముద్రించిన ఏకైక స్టాంప్ ఇది. ఈ స్టాంప్‌ను ఫ్యాషన్‌ డిజైనర్ 2014లో కొనుగోలు చేశారు. చిన్నతనం నుంచి స్టాంపులు, నాణెలను వీట్జమన్‌ సేకరిస్తున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును తన డిజైన్‌ స్కూల్‌తో పాటు వైద్య పరిశోధన, మాడ్రిడ్‌లోని మ్యూజియం, పలు స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement