Friday, March 29, 2024

Telangana | 9, 10 తరగతి పరీక్షల్లో ఇక ఆరు పేపర్లే.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

ప‌రీక్ష‌ల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో ప‌లు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పది తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 2022-23 నుంచి ఈ సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తేస్తోంది. ప‌రీక్ష‌ల్లో అధికారులు ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షకు 80, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు ఉంటాయి. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల (బుధ‌వారం) ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప‌దో త‌ర‌గ‌తి వార్షిక పరీక్షలను 11 నుంచి ఆరు పేపర్లకు కుదించింది. ఈ మేర‌కు విద్యాశాఖ ప్రతిపాదనల‌ను ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా తొమ్మిది, పది తరగతులకు ఆరేసి పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ‌తంలో తెలుగు, ఇంగ్లిష్‌, గ‌ణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా నిర్వహించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష పరీక్ష నిర్వహించేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement