Thursday, March 28, 2024

అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ : మంత్రి ఎర్ర‌బెల్లి

రాష్ట్రంలో అమల‌వుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేద‌ని, ఎన్టీఆర్ త‌ర్వాత సీఎం కేసీఆర్ నే ఇష్ట‌ప‌డ‌తా అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్ర‌వారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ నుండి ఇనుగుర్తి వరకు రూ.12 కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు, 20 లక్షలతో చేపట్టిన రెడ్లవాడ గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి, కోటి 70 లక్షలతో చేపట్టిన రెడ్ల వాడ గ్రామ అంతర్గత సీసీ రోడ్ల పనులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి రెడ్ల వాడలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం రెడ్లవాడలో జరిగిన బహిరంగ సభకు గ్రామంలో మంత్రి, ఎమ్మెల్యేలకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం ప‌లికారు. పూలు చల్లి డప్పు చప్పుళ్ళు, టపాకాయలు పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామాలు గతంలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చెందుతున్నాయ‌ని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలుగుతున్నాయ‌న్నారు. 90 శాతానికి మించి పనులు జరిగాయి, ఎంత చేసినా ఇంకా చేయాల్సిన పనులు మిగిలే ఉంటాయ‌న్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేద‌న్నారు. కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు వంటి పథకాలు గతంలో ఎప్పుడైనా చూశారా? నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను కేసీఆర్ లాంటి గొప్ప సీఎంను నేను చూడలేద‌న్నారు.

ఎన్ టీఆర్ తర్వాత నేను కేసీఆర్ నే ఇష్ట పడతాన‌న్నారు. నాకు కేసీఆర్ గొప్ప అవకాశం ఇచ్చారు.. మంత్రిని చేశారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధికి పాటు పడుతున్న అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మంచి ఎమ్మెల్యే.. వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే అయితే, ఇంకా అభివృద్ధి జరిగేది.. ఇప్పటికైనా మంచి పని చేశారు. ప్రజలు మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి ని గెలిపించుకావాల‌న్నారు. నేను నా శాయ శక్తులూ ఒడ్డి సీఎం తో మాట్లాడి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాన‌న్నారు. సీఎం కేసీఆర్ గారిని ఎప్పుడు కలిసినా పెద్ది నియోజకవర్గం గురించే మాట్లాడుతాడు అని, అలాంటి ఎమ్మెల్యే మీకు ఉన్నందుకు మీరు అదృష్టవంతులు అన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ ని కాపాడుకోవాల‌న్నారు. ఆయన కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాల‌న్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాన‌ని, మరింత గా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాల‌న్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ పురోగతికి పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమాల్లో ఆర్ అండ్ బీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జ‌డ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement