రెండు వన్డేల్లో జింబాబ్వేను చిత్తుగా ఓడించిన భారత్, ఆ జట్టుతో మూడో మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో బలహీనంగా కన్పిస్తున్న జింబాబ్వే ఈ మ్యాచ్లో భారత్ జోరును తట్టుకుని నిలవాలంటే ఏదైనా మేజిక్ చేయాల్సి ఉంటుంది.
భారత్ , జింబాబ్వే మధ్య మూడో వన్డేను తిలకించడానికి క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు వన్డేలలో చెలరేగిపోయిన టీమిండియా సోమవారం జింబాబ్వేను ఢీ కొననుంది. అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న రాహుల్ సేనకు ఈ మ్యాచ్లోనూ విజయం నల్లేరుపై నడక కానుంది. అయితే ఆటగాళ్లంతా రాణించినా రాహుల్ ఫామ్పైనే సందేహాలు నెలకొన్నాయి. తొలి మ్యాచ్లో బ్యాటింగ్కు అవకాశం రాకపోగా రెండో వన్డేలో బరిలోకి దిగినప్పటిప్పటికీ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు రాహుల్. దీంతో మూడో వన్డేలో ఎలా ఆడతాడా అనేది కీలకం కానుంది.
మరో వైపు ప్రత్యర్థి జట్టు అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. తొలి వన్డేలో 191 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే, బౌలింగ్ లోనూ రాణించలేకపోయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లక్ష్యాన్ని వికెట్ పోగొట్టుకోకుండా చేధించారు. రెండో వన్డేలో జింబాబ్వే బ్యాటింగ్ మెరుగు పడకపోగా.. మరింత దిగజారింది. 161 రన్స్కే చాపచుట్టేసింది. అయితే బౌలింగ్లో భారత్ను కాస్త ఇబ్బంది పెట్టింది. మెరుగ్గా బంతులేస్తూ వికెట్లు పడగొట్టింది. అయినప్పటికీ ఓటమిని మూటగట్టుకుంది ఈ నేపథ్యంలో మూడో వన్డేలో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని భారత్ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తికరం.
రాహుల్ సారథ్యం ఫలించింది..
కెప్టెన్సీ విషయంలో కెఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. ఆటగాళ్లకు స్వేచ్చనిస్తూ అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నాడు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన అతడు.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోయాడు. తొలి వన్డేలో ధావన్, గిల్ రికార్డును ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. రెండో వన్డేలో రాహుల్ తనను తాను ఓపెనర్గా ప్రమోట్ చేసుకున్నాడు. ఈ నిర్ణయం బెడిసి కొట్టింది. అయినప్పటికీ మూడో మ్యాచ్లో రాహుల్ ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే రాహుల్ తన మునుపటి ఫామ్ను అందుకునేందుకు ఎంత సమయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. ఆసియాకప్ టోర్నికి వారం రోజులే ఉన్న నేపథ్యంలో అతడి ఫామ్ టీమిండియాకు కీలకం.
ఇక బ్యాటర్లలో ఇషాన్ కిషన్ మరో అవకాశం వస్తే రాణించాలని ఉవ్వీళ్లూరుతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్లో సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. ఫ్రంట్ లైన్ బౌలర్లు లేనప్పటికీ దీపక్ చాహర్, సిరాజ్, శార్దూల్, ప్రసిద్ద్, అక్షర్లతో కూడిన బౌలింగ్ దళం. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోను ఫలితం భారత్కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది.