Thursday, April 25, 2024

ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. మరో స్వామిజీ నోటీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరికొందరు చిక్కుతున్నారు. కేరళకు చెందిన వైద్యులు డాక్టర్‌ జగ్గుస్వామికి ఇవ్వాల (శుక్రవారం) సిట్‌ అధికారులు నోటీసు జారీచేశారు. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని ఆయనను కోరారు. ఇప్పటికే 21న విచారణకు రావాలని కేరళకు చెందిన తుషార్‌కు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయగా, ఇపుడు జగ్గుస్వామి కూడా వీరితో పాటు చేరారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా, సిట్‌ వీరిని విచారిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఏడుబృందాలతో హైదరాబాద్‌ సిపి సివి ఆనంద్‌ ఆధ్వర్యంలో సిట్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ సాగుతోంది. తెలంగాణతో పాటు కేరళ, ఫరీదాబాద్‌ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంలో ఇంకా ఎవరెవరున్నారో గుర్తించి మరిన్ని కేసులు నమోదుచేయాలని అధికారులు యోచిస్తున్నారు.

- Advertisement -

మొయినాబాద్‌ ఫాంహౌజ్‌లో పట్టుబడ్డ ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ల నెట్‌వర్క్‌ను, నిందితుల కాల్‌ డేటా, డైరీల ఆధారంగా కీలక సమాచారాన్ని ప్రత్యేక అధికారులు రాబడుతున్నారు. ఈ కేసులో ఎ-1గా ఉన్న రామచంద్రభారతికి ఆశ్రయమిచ్చింది జగ్గుస్వామినే అని సిట్‌ అధికారులు గుర్తించారు. తుషార్‌, రామచంద్రభారతి, జగ్గుస్వామి ముగ్గురు స్నేహితులన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. వీరి ఆధారంగా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement