సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాలను రూ. 11 కోట్లతో అధునాతన హంగులతో అద్భుత రాజసౌధంగా నిర్మించారు. ఒకేచోట బడి, జూనియర్ కళాశాల నిర్వహించేలా ఆధునిక వసతులతో భవనం నిర్మించారు. పాఠశాల భవనాన్ని ఇటీవల టీఎస్ఈడబ్ల్యూడీసీ అధికారులు పాఠశాల, జూనియర్ కళాశాల అధికారులకు అప్పగించారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనం ఒకేచోట అద్భుతంగా నిర్మించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
దుబ్బాక పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతున్నది. 12 తరగతి గదులు, 6 ల్యాబ్ గదులు, 1 హెచ్ఎం గది, 1 కార్యాలయ గది, 2 స్టాఫ్ గదులు, 1 కంప్యూటర్ గది, 1 లైబ్రరీ గది ఇలా మొత్తం 24 గదులు ఉన్నాయి. జూనియర్ కళాశాలలో మొత్తం 30 గదులు ఉన్నాయి. ఇందులో తరగతి, ప్రాక్టికల్స్ గదులు 26, స్టాఫ్ రూమ్ రెండు, ప్రిన్సిపాల్ గది 1, కార్యాలయ గది 1 ఉన్నాయి.