Tuesday, April 16, 2024

Judgment | న‌మ్మించి ప్రాణం తీసిన ఫ్రెండ్‌.. యువ‌తిని రేప్ చేసి, హ‌త‌మార్చిన‌ వ్య‌క్తికి జీవితకాల శిక్ష

త‌ల్లిదండ్రుల‌కు సాయం చేసే ఓ యువ‌తి పేద‌రికాన్ని ఆస‌రాగా చేసుకున్నాడో వ్య‌క్తి.. ప‌రిచ‌యం పెంచుకుని క‌ప‌ట స్నేహం ప్ర‌ద‌ర్శించాడు. ఆ యువ‌తి బ‌ర్త్ డే నాడు గుడికి తీసుకెళ్తాన‌ని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. అయితే.. త‌ల్లిదండ్రుల‌కు సాయంగా ఉన్న ఆ యువ‌తి గుడికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి ఎంత‌కూ రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కానీ, ఇక త‌మ కూతురు లేద‌న్న విష‌యం తెలుసుకోలేక‌పోయారు. మ‌రునాడు ఉద‌యం ఈ పిడుగులాంటి వార్త తెలిసి వారి గుండె ఆగిపోయినంత ప‌న‌య్యింది.. అమ్మాయిని న‌మ్మించి రేప్ చేసి, చంపేసిన వ్య‌క్తికి ఇవ్వాల జీవిత‌కాల శిక్ష ప‌డింది..

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): బర్త్ డే రోజున గుడికి తీసుకువెళ్తాన‌ని చెప్పి కిడ్నాప్ చేసి, రేప్‌ చేసి చావుకు కారణమై.. ఆ తర్వాత మర్డర్ తన మీదకు రాకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేసే యత్నాలు చేసిన‌ట్టు కోర్టులో నిరూపణ అయ్యింది. ఈ కేసులో వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి విజయలక్ష్మి సోమవారం సంచలమైన తీర్పునిచ్చారు. 4 సెక్షన్లపై నమోదైన కేసుల్లో ఒక్కో సెక్షన్ కు లక్ష రూపాయాల జరిమానాగా 4 లక్షలు, 302 ఐ పి ఎస్ కేసు కు జీవిత ఖైదు, మరో రెండు కేసులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంకో కేసుకు ఏడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

2019 అక్టోబర్ 27న హన్మకొండ విష్ణు ప్రియ గార్డెన్స్ ఏరియాలో ఉండే గడ్డం మౌనిక ఇళ్లల్లో పని చేస్తూ, పేరెంట్స్ చేసే కూరగాయల వ్యాపారంలో సహాయం చేసేది. తన బర్త్ డే రోజు గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన‌ 18 ఏళ్ళ ఈ యువతి అదే రోజు రాత్రి రక్తపు మడుగులో శ‌వంగా క‌నిపించింది. ఆమె మృతదేహాన్ని ఇంటి సమీపంలో గుర్తించారు. సదరు యువతిని స్టేషన్ ఘన్ పూర్ నమిలికొండ గ్రామానికి చెందిన పులి సాయి కుమార్ అలియాస్ సాయి గౌడ్ (21) తన కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్‌ చేశాడు. దాంతో ఆ యువతికి విపరీతమైన రక్తస్రావమై చ‌నిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన నిందితుడు మృతదేహంతోనే హన్మకొండ చేరుకొని, కొత్త డ్రెస్ కొనుగోలు చేసి, శాయంపేట వైపుకు వెళ్లి, మృతురాలి డ్రెస్ మార్చాడు.

- Advertisement -

ఆతర్వాత మృతదేహాన్ని మృతురాలి ఇంటి సమీపంలో పడవేసి, ఎస్కేఫ్ అయ్యాడు. ఈ విషయంపై మృతురాలు అన్నయ్య శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును సిఐ శుకర్, ఎస్సై వెంకటస్వామి, కోర్టు కానిస్టేబుల్ రాజు నిరూపించే సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, స్పెషల్ పిపి ఎం.సత్యనారాయణ, అసిస్టెంట్ పిపి మహ్మద్ సర్ధార్ కేసును వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement