Saturday, April 20, 2024

లాక్ డౌన్ ఒక్కటే మార్గం.. ‘న్యాయ్’తో రక్షణ: రాహుల్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజు కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా ప్రతిరోజు మూడు వేలపైనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి సంపూర్ణ లాక్ డౌన్ మాత్రమే ఏకైక పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆరోపణలు గుప్పించారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను నియంత్రించాలంటే పూర్తిస్థాయి లాక్‌ డౌన్ ఒక్కటే పరిష్కారం. లాక్‌ డౌన్ వల్ల నష్టపోయే వర్గాలకు ‘న్యాయ్’ ద్వారా రక్షణ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఏం చేయలేదు. వారి అలసత్వంతోనే చాలా మంది ప్రజల ప్రాణాలు పోతున్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

కాగా, న్యాయ్(కనీస ఆదాయ పథకం) పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.72,000 అందజేస్తామని కాంగ్రెస్ అప్పట్లో తెలిపింది. ‘న్యాయ్’గా వ్యవహరించే ఈ పథకం కింద దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుందని రాహుల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement