Friday, April 19, 2024

‘ఎమ్మెల్యేల ఎర’ ఈడీ దర్యాప్తుపై విచారణ 28కి వాయిదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో జరిగిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఈడీ దర్యాప్తుపై విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ఆపాలన్న ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు ఈడీ కౌంటర్‌పై వాదనలకు రోహిత్‌రెడ్డి తరుపు న్యాయవాది గడువు కోరారు. పరిశీలించిన ధర్మాసనం విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నో మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ఎర కేసు ఇప్పటికే సీబీఐకి చేరింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని.. సిట్‌ దర్యాప్తు యథావిధిగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను సీజే ధర్మాసనం ఇదివరకే కొట్టేసింది. ఈ పిటిషన్‌కు అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నేర తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సింగిల్‌ బెంచ్‌.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తెలిపింది.

ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ జరుపుతుండగా.. ఇప్పుడు సీబీఐకి అప్పగించడం సరికాదని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును పరిశీలిస్తామన్న ధర్మాసనం ఈనెల 27కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఈ క్రమంలోనే హైకోర్టు 28కి వాయిదా వేసింది.

కొనుగోలుకు దారితీసిన అంశాలపై సీబీఐ దృష్టి..

మరోవైపు ఎమ్మెల్యేల ఎరకేసులో సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో.. సీబీఐ అధికారులు కొద్దిరోజులుగా తమ దర్యాప్తు చేపట్టారు. మెయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు రద్దు చేస్తున్నట్లు- సింగిల్‌ బెంచ్‌ గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే సీబీఐ మొదటినుంచీ తనదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement