Thursday, April 18, 2024

తెలంగాణ రత్నం సింగరేణి బొగ్గు.. 34వేల కోట్ల టర్నోవర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశానికే తలమానికంగా మారిన సింగరేణి బొగ్గుగనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. రికార్డుస్థాయిలో ఈ ఏడాది ఈ ఏడాది సుమారు 70మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. అదేసమయంలో రూ.34వేల కోట్ల రికార్డు టర్నోవర్‌కు చేరువలో ఉన్నామన్నారు. గురువారం సింగరేణి భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ గత ఏడాది 26 వేల కోట్ల టర్నోవర్‌ సాధించిందని తెలిపారు. దేశాభివృద్ధికి తమవంతు భాగస్వామ్యంగా బొగ్గు, థర్మల్‌ విద్యుత్తును ఈ సంస్థ అందిస్తోందని, ఆత్మ నిర్బర్‌ భారత్‌ లో భాగంగా మరో ఐదేళ్లలో 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు.

భారతదేశం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఏడాది 7 నుంచి 10 శాతం విద్యుత్‌ వినియోగం పెరుగుతోందన్నారు. మరో మూడేళ్ళలో విదేశీ బొగ్గు దిగుమతులకు స్వస్తి పలకాలని యోచిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోల్‌ ఇండియా, సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు 1200 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించిదని చెప్పారు.

ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా కొత్త బొగ్గు బ్లాక్‌లను కేటాయించడం జరిగిందని శ్రీధర్‌ పేర్కొన్నారు. పర్యవసానంగా రానున్న కాలంలో బొగ్గు మార్కెట్లో ప్రైవేట్‌ బొగ్గు ఉత్పత్తి దారులతో కొంత పోటీ పరిస్థితులు నెలకొంటాయని, అయినప్పటికీ సింగరేణి సంస్థ తన పనితీరు, అనుభవం, క్రమశిక్షణ వలన పోటీ మార్కెట్‌ను తట్టు కోగలదని తెలిపారు. ప్రతి కార్మికుడు ఉత్పాదకత పైన దృష్టి సారిస్తే, ఉత్పత్తి వ్యయం తగ్గి, తక్కువ ధరకే వినియోగదారుడికి బొగ్గు సరఫరా చేసే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా పోటీ మార్కెట్‌ ను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.

- Advertisement -

వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అత్యద్భుతమైన పనితీరుతో 91 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) తో దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని సీఎండీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది సింగరేణి పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పనితీరును గుర్తించి మరో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ను కూడా ఏర్పాటు- చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారని, మరో రెండు నెలల్లో నిర్మాణపు పనులు ప్రారంభమవుతాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement